అవును శెట్టి సమయాల పునర్నిర్మాణం ఒక చారిత్రత్మక అవసరం.
గతం లో భారత దేశమంతటా రాజరికం వున్నప్పటికీ శెట్టి సమయాల సలహా సంప్రదింపులతోనే రాజ్య పాలన సాగేది. రాజ్యం లో వస్తు ఉత్పత్తి అధికంగా వున్నప్పుడు రాజులు అంతర్ రాజ్య వ్యాపారానికి అనుమతులు ఇచ్చే వారు తద్వారా సంపదను పెంచుకున్నారు.
దేశీయ రాజుల నుండి మహమ్మదీయ పాలకులు రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ ఈ శెట్టి సమయాలు తమ ప్రాధాన్యతలను అలాగే నిలుపుకున్నాయి.
ఔరంగాజేబు చక్రవర్తి కాలంలో ముస్లిం పాలకులు విధించిన అమానుషమైన పన్నులను రద్దు చేయించిన శెట్టి సమయాల ఘనవిజయానికి సాక్ష్యం 16వ శతాబ్దం నాటి ఈ శాసనం.ఇందులో మహానాటి వారు అంటే శెట్టి సమయం అని అర్థం.
సమయ మంత్రి కట్నం సమయ మంత్రికి చెల్లించాల్సిన ఫీజు అని అర్థం.
శాసనం -1
ఎర్రంశెట్టి మీరాపాత్రుడు. వలదు యెలిజేటి శ్రీగవిరి ఆర్కాగుండవర ప్రవర్ధన వరాత్త జగదేవు కంశేంజేటి అశ్వపతి, గజపతి, నరపతి మూడు సిం హాసనాల రాజులున్నూ దేశాలలో నడిపించుచున్న పన్నులు వర్ణాశ్రమ ధర్మాల కల్లా పన్నులు.
1. గోవులకు తోకరూకలు పన్ను
2. బ్రాహ్మణులకు బొట్లపన్ను
3. తలవెంట్రుక స్త్రీలకు వర్ణాశ్రమ ధర్మాల పన్ను
4. ఋతువుల పన్ను
5. స్తనముల పన్ను
6. శుభశోభనాలకు పన్ను
7. సమస్త వర్ణాశ్రమ ధర్మాల వారికి పన్ను
ఈ పన్నులు రద్దు చేస్తూ
1. పెండ్లిండ్లకు దేవుని కట్నం ఒక రూక
సమయ మంత్రి కట్నం ఒక రూక
ఒజ్జలు కట్నం ఒక రూక
మంగలి వాని కట్నం ఒక రూక
2. పంట పుట్టి కుంచాలు, గోనెకు హర్బాజాకు ఒకటికి ఒక కాసు ఈ పద్దతిన ఏర్పాటు చేసి మహానాటి పెద్ద మాట మీరితే
1. కులం తప్పు
2. మహనాటివారి తప్పు
3. దివాణం తప్పు
4. దేవుని తప్పు విధిస్తారు
ఇందుకు సాక్షులు:
1. పూర్వలింగ
2. నారదలింగ
3. మార్కండేయులు
4. కవి సర్వాంచనులు
* * *
నాటి నవాబులు కూడా గ్రామాలలో శెట్ల సలహా సంప్రదింపులతోనే పరిపాలనలు సాగించారు.అలా ప్రజల సమస్యలను, అవసరాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్ళి వాటిని పరిష్కరించ గలిగిన స్థాయిలో శెట్టి సమయాలు మనుగడ సాగించగలిగాయి.
ధర్మబధ్ధమైన జీవన విధానం, కఠినమైన నియమాలు, నియంత్రణ వల్ల గ్రామాలు స్వయం సమృద్ధాలుగా వెలిగాయి.
ఈ శెట్టి సమయాల కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా అదే రోజు చర్చించుకుని పరిష్కరించుకునేవారు.
గ్రామాలలో తమ వల్ల ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఉన్నత స్థాయిలో వున్న సమయ పాలకుల దృష్టికి తీసుకు వెళ్ళేవారు.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి వుంది రాజరికంలో కూడా అసలు సిసలైన ప్రజాస్వామ్యం నడిపించిన వ్యవస్థలు మన శెట్టి సమయాలు...
మరి నేడు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజస్వామ్యం గా పరిఢవిల్లుతున్న భారతదేశంలో నిజంగా ప్రజాస్వామ్యం వుందా???
అది ఎంత అపహాస్యం పాలవుతున్నదో మనం నిరంతరం గమనిస్తూనే వున్నాం.
ఎన్నికలప్పుడు మనముందుకు వచ్చే నాయకులు నిజంగా మనకు నచ్చే ఎన్నుకోబడుతున్నారా?నిజమైన నాయకులను నిలబెట్టి ఎన్నుకునే అవకాశం మనకు వుందా???
మన సమస్యలను పరిష్కరించకపోతే వారిని పదవులనుండి దించగలిగే శక్తి ప్రజలకు వుందా???
రైతు ఆరుగాలం పండించిన పంటకు నష్టం లేని గిట్టుబాటు ధరను అడిగే హక్కు వుందా???
దేశంలోని యువతకు ఉపాధి కల్పిస్తామంటూ కనీస ఉపాధిని కూడా కల్పించలేని మాయగాళ్ళను నిలదీయగల సమర్థత వుందా???
దొంగలు దేశాన్ని దోచుకుంటూ వుంటే వారిని శిక్షించగల సత్తా ప్రజలకు వుందా???
ప్రజలకు ఏ అధికారం లేని ప్రజాస్వామ్యం మనది.
మనకున్న ఒకే ఒక్క అధికారం ఓటు వేయడం.
దాన్ని కూడా డబ్బు,సారా లతో కొనుగోలు చేస్తూ దేశాన్ని దోచుకునే దొంగలు ప్రజలను నిరంతరం అపహాస్యం చేస్తూనే వున్నారు.
ఈ వ్యవస్థ మరికొంత కాలం కొనసాగితే అక్రమంగా దోచుకునే వాడు సంపన్నుడవుతాడు. సామాన్యుడు మరింత దరిద్రుడవుతాడు.
ఈ వ్యత్యాసం భవిష్యత్తులో ఎన్నో విపరీతాలకు దారి తీసే ప్రమాదం వుంది.
ఎన్నికల్లో రైతు రుణాలు రద్దు చేస్తాం అని ఆశలు కల్పించి ఎన్నికలకు వస్తున్నారు. ఒక లక్ష రూపాయల అప్పు రద్దు చేసే బదులు బస్తా ధాన్యం రూ.1500/- మద్దతు ధర కల్పిస్తే అప్పులు రద్దు చేయాల్సిన అవసరం ఉండదు.
ఈ విషయం నాయకులకు తెలియక కాదు. ప్రజలను స్వతంత్రులుగా బ్రతకనీయకుండా తమపై ఆధార పడేటట్లు చేసుకోవడమే వారి విధానం.
ఇలాంటి విధానాలకు పాల్పడుతున్న వారిని నిలదీసే సమర్థత నేటి వ్యవస్థలో ప్రజలకు వుందా???
అలా ప్రశ్నిచగలిగే సమర్థత ఒక్క శెట్టి సమయాలకు మాత్రమే వుంటుంది.
ఎందుకంటే ఈ శెట్టి సమయాలు మెజారిటీ ప్రజల సమూహాలు.
వీరి మాటలే శాసనాలవుతాయి.
వీరి ఆశలే భవిష్యత్ నిర్ణయాలవుతాయి.
ప్రజాస్వామ్యంలో ప్రజలు బిచ్చగాళ్ళు కాదు వారే శాసన కర్తలు అని నాయకులు ఒప్పుకునే పరిస్థితి కల్పించగలిగే దమ్ము కేవలం శెట్టి సమయాలకు మాత్రమే వుంటుంది.
అందుకే శెట్టి సమయాలను పునర్నిర్మించాల్సిన చారిత్రాత్మక అవసరం వుంది.
ఈ శెట్టి సమయాల లక్ష్యం ఒక్కటే, అది భరతమాత పూర్వ వైభవాన్ని సాధించడమే.